8 మార్చి, 2012

జగనా, చంద్రబాబా ఇప్పుడే చెప్పలేం: అఖిలేష్ యాదవ్

                                Akhilesh Yadav


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మద్దతిస్తామా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను బలపరుస్తామా అనేది ఇప్పుడే చెప్పలేమని ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ యువనేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఎన్టీవీకి ఆయన బుధవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇద్దరు నేతలతోనూ తమకు మంచి సంబంధాలున్నాయని ఆయన చెప్పారు. చంద్రబాబుతో తన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌కు మంచి సంబంధాలున్నాయని ఆయన చెప్పారు. వైయస్ జగన్‌తో తాను చాలాసార్లు మాట్లాడానని ఆయన చెప్పారు. అయితే, రాజకీయాలకు వచ్చే సరికి తాము ఎవరికి మద్దతిస్తామనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. 

దేశాభివృద్ధికి కాంగ్రెసు, బిజెపియేతర కూటమి ఏర్పడాల్సి ఉందని ఆయన అన్నారు. ఆ ప్రంట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. ఇప్పటికిప్పుడు జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ గురించి మాట్లాడడం తొందరపాటే అవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ విభజనకు ఆయన వ్యతిరేకంగా ప్రతిస్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విభజించాలనే డిమాండ్ ఉందని, ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని అంటున్నారని, ఉత్తరప్రదేశ్‌ను విభజించాలనే మాయావతి ప్రతిపాదనను ప్రజలు తిరస్కరించారని, పెద్ద రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.

తాము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉందని, వాటిని అమలు చేయకపోతే ప్రజలు శిక్ష వేస్తారని ఆయన అన్నారు. రాహుల్ ఉత్తరప్రదేశ్‌లో చాలా శ్రమించారని, ప్రజలకు కలలు చూపించారని, అయితే రాహుల్ గాంధీని ప్రజలు విశ్వసించలేదని ఆయన అన్నారు.

కామెంట్‌లు లేవు: