7 మార్చి, 2012

అజర్‌కు రూ. 15 లక్షల జరిమానా, కోర్టు ఆగ్రహం

                                           Mohammed Azharuddin
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మొహ్మద్ అజరుద్దీన్‌పై ఢిల్లీ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు కోర్టు 15 లక్షల రూపాయల జరిమానా విధించింది. చెక్ బౌన్స్ కేసులో తమ ముందు హాజరు కాకుండా తమ సమయం వృధా చేస్తున్నారని కోర్టు అజర్‌పై మండిపడింది. ఈ కేసులో అజర్ తమ ముందు హాజరు కాకపోవడంతో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ విక్రాంత్ వెయిద్ ఇంతకు ముందు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేశారు. 

కోర్టు వెలుపల అవగాహనకు వస్తామనే సాకుతో ఆయన కోర్టుకు హాజరు కాలేదు. అవగాహన కుదుర్చుకోదలుచుకుంటే అది మొదటి రోజునే జరగాల్సిందని మెజిస్ట్రేట్ అభిప్రాయపడ్డారు. అజర్‌ను కోర్టులో హాజరు పరుస్తానని బాండ్, సెక్యూరిటీ ఇచ్చి విఫలమైన ఆయన మిత్రుడికి మెజిస్ట్రేట్ లక్ష రూపాయల జరిమానా విధించారు. 

ముంబైలోని తన పేరు మీద, తన భార్య పేరు మీద జాయింట్‌గా ఉన్న 4.5 లక్షల విలువ చేసే ఆస్తిని అమ్మాలని అజర్ అనుకున్నాడని, దాన్ని కొనడానికి అడ్వాన్స్‌గా 1.5 లక్షల రూపాయలు చెల్లించానని, వివాదం కారణంగా దాన్ని అమ్మడానికి అజర్ నిరాకరించి, అడ్వాన్స్ తిరిగి ఇస్తానని చెప్పారని, అందుకు అజర్ ఇచ్చిన చెక్కులు చెల్లలేదని ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్ సోలంకి ఫిర్యాదు చేశారు.

కామెంట్‌లు లేవు: