25 జులై, 2012

నాని ఎఫెక్ట్: ఫ్యాన్స్ భయంతో వెళ్లని ఎన్టీఆర్

















కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వ్యవహారం హీరో జూనియర్ ఎన్టీఆర్‌కి తీవ్ర ఇబ్బందులనే కలిగిస్తోందని అంటున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి జై కొట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తన విజయవాడ పర్యటన కూడా రద్దు చేసుకున్నారట.

జూనియర్ ఎన్టీఆర్ ఓ జ్యూవెల్లరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ జ్యూవెల్లరీ కంపెనీ విజయవాడలో ఆదివారం ఓ షోరూంను ప్రారంభిస్తోంది. అక్కడ జూనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఫాలోయింగ్ ఉంది. దీంతో అతని చేతనే ఈ దుకాణాన్ని ఓపెనింగ్ చేయించేందుకు ఆ కంపెనీ నిర్ణయించుకుంది. జూ.ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఆ కంపెనీ ప్రకటనలలో మాత్రమే కనిపించారు. ఏ దుకాణాన్ని ఓపెన్ చేయలేదు.

అయితే విజయవాడలో ఓపెనింగ్‌కు మాత్రం ఆయన అంగీకరించారట. ఈ జిల్లాతో తనకు వ్యక్తిగతంగా ఉన్న సంబంధాలు, సెంటిమెంట్ వంటి వాటి కారణంగా ఓపెనింగ్‌కు జూనియర్ అంగీకరించారట. అయితే చివరి నిమిషంలో జూనియర్ తన విజయవాడ పర్యటనను రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. తాను మరో మూడు నెలల వరకు అందుబాటులో ఉండలేనని, కాబట్టి తాను లేకుండానే దుకాణాన్ని ప్రారంభించుకోవాలని కంపెనీ యజమానులకు విజ్ఞప్తి చేశారట.

జూనియర్ సున్నితంగా తిరస్కరించడంతో ఆ కంపెనీ ప్రముఖ బాలీవుడ్ మాజీ నటి, బిజెపి ఎంపి హేమమాలినిచే ఆ దుకాణాన్ని ప్రారంభింప చేయనుంది. అయితే జూనియర్ వెనక్కి తగ్గడం వెనుక నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఎక్కడ అడ్డుకుంటారోననే ఆందోళనతోనే అని అంటున్నారు. కొడాలి నాని వ్యవహారం తర్వాత జిల్లాకు చెందిన నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు జూనియర్ పైన గుర్రుగా ఉన్నారట.

ఇప్పటికై నాని జగన్ వైపు వెళ్లారు. జూనియర్‌కు సన్నిహితుడిగా ముద్రపడ్డ మరో నేత వల్లభనేని వంశీ వ్యవహారంపై కూడా వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఆయన పార్టీలో ఉంటారో ఉండరో అనే అనుమానాలు వారిని వెంటాడుతున్నాయట. తనకు సన్నిహితులుగా ముద్రపడిన వారిలో ఒకరు ఇప్పటికే వెళ్లడం, మరొకరిపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో విజయవాడ వెళితే అభిమానుల నుండి ఆగ్రహం చవి చూడాల్సి వస్తుందని జూనియర్ భావించి ఉంటారని అంటున్నారు.

కామెంట్‌లు లేవు: