25 జూన్, 2012

జగన్ రిమాండ్ పొడిగింపు, ఈడి పిటిషన్ వాయిదా



















వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని విచారించేందుకు అనుమతించాలన్న ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) పిటిషన్ పైన విచారణను నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 28వ తేదికి వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో రిమాండులో ఉన్న జగన్‌ను విచారించేందుకు తమకు అనుమతించాలని ఈడి ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వైయస్ జగన్ కౌంటర్ దాఖలు చేశారు. దీంతో కోర్టు విచారణను వాయిదా వేసింది.

జగన్ ఆస్తుల కేసులో దాఖలైన మూడు ఛార్జీషీట్లపై కోర్టు నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు ఎదుట ఆ మూడు ఛార్జీషీట్లలో పేర్కొన్న నిందితులు అందరూ హాజరయ్యారు. దీని విచారణనను జూలై 4కు వాయిదా వేసింది. మరోవైపు జగన్, బిపి ఆచార్యల రిమాండ్ ముగియడంతో కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా వారిని విచారించింది. అనంతరం వారికి జూలై 4వ తేది వరకు రిమాండును పొడిగించింది. జగన్ ఆస్తుల కేసులో అరెస్టైన నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్ పైన విచారణను కోర్టు 28కి వాయిదా వేసింది.

మూడు ఛార్జీషీట్ల విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని ఐఏఎస్ వెంకట్రామి రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు అంగీకరించిన కోర్టు జూలై 4న విచారణకు హాజరు కావాలని సూచించింది. మరోవైపు ఈడి అధికారులు చంచల్‌గూడ జైలుకు ఉదయం పదిన్నర గంటలకు చేరుకొని జగన్ ఆస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను విచారిస్తున్నారు.

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి సంబంధించి బెయిల్ ఫర్ స్కామ్ కేసులో మాజీ న్యాయమూర్తి చలపతి రావు, రవిచంద్రను ఎసిబి అధికారులు తమ కస్టడీకి తీసుకున్నారు. వారిని ఎసిబి అధికారులు చర్లపల్లి జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. ఐదు రోజుల పాటు వారిని విచారించనున్నారు.













కామెంట్‌లు లేవు: