25 జూన్, 2012

చెత్త సినిమాలే వందకోట్లు దాటుతున్నాయి




















చెత్తసినిమాలన్నీ బాక్సాఫీస్‌ దగ్గర రూ.100 కోట్లు వసూలు చేస్తున్నాయని ప్రముఖ దర్శక, నిర్మాత విధు వినోద్‌ చోప్రా వ్యాఖ్యానించటం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా 'రౌడీ రాథోర్'చిత్రం భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న సమయంలో ఆయన అలా కామెంట్ చేయటం చాలా మందిని భుజాలు తడుముకునేలా చేసింది. దాంతో ఒళ్లు మండిన 'హౌస్‌ఫుల్‌', 'హేబేబీ' చిత్రాల దర్శకుడు సాజిద్‌ ఖాన్‌ ఖండిస్తూ కామెంట్ చేసాడు.

సాజిద్ ఖాన్ మాట్లాడుతూ..''అంకెల గురించి నాకు తెలియదు. ప్రేక్షకులు మెచ్చితేనే సినిమా బాగా ఆడుతుంది. వారు ఆదరించటంతో చెత్త సినిమాలు వంద కోట్ల మార్కు దాటుతున్నాయి. అలాగని ప్రేక్షకుల అభిరుచి చెత్తగా ఉందని అనకూడదు. తుది తీర్పునిచ్చేది ప్రేక్షక దేవుళ్లే.. అంకెలు ముఖ్యం కాదు ప్రేక్షకులు ఎలా స్పందిస్తున్నారనేది అత్యంత కీలకం'' అన్నాడు.

ఇక సాజిద్ ఖాన్ కూడా తాను త్వరలో రీమేక్ చేస్తున్న 'హిమ్మత్‌ వాలా' తొలి వారంలోనే రూ.100 కోట్ల మార్కు దాటేస్తుందని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ..''నేనెదో గొప్ప దర్శకుడినని చెప్పుకోవటం లేదు. కానీ నేను గొప్ప ప్రేక్షకున్ని. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం తప్ప మరే పని తెలియనట్లుగా పెరిగాను. సినిమా నా జీవితం. నా ఖాతాలో ఒక్క ఫ్లాప్‌ సినిమా కూడా లేదు. నేను సినిమాలు తీసేది నాకోసం కాదు.. ప్రేక్షకుల కోసం. వారినెప్పుడు నిరాశపరచను. గతంలో విడుదలైన నా చిత్రాలతో ఆ సంగతి నిరూపించుకున్నాను. నా 'హిమ్మత్‌ వాలా' తొలివారంలోనే రూ.100 కోట్లకు పైగా వసూలు చేస్తాడు'' అన్నాడు.

రవితేజ,రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన సూపర్‌హిట్ ఫిల్మ్ 'విక్రమార్కుడు'. ఈ చిత్రంకు రీమేక్‌గా ప్రభుదేవా 'రౌడీ రాథోర్' చిత్రాన్ని రూపొంది ఆ మధ్యన బారీగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓపినింగ్స్ మాత్రం అదరిపోయే రేంజిలో తెచ్చుకుంది. ఇండియాలో దాదాపు పదిహేను కోట్లకు పైగా మొదటి రోజు కలెక్టు చేసి రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రాన్ని అక్కడ మీడియా ఓ పాత కాలం సినిమాగా కొట్టిపారేసింది. అయినా కలెక్షన్స్ కుంభవృష్టి కురుస్తోంది.

కామెంట్‌లు లేవు: