2 జులై, 2012

ఎపి: నారా లోకేష్ మరో అఖిలేష్ అవుతారా?



















తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కుమార్ రాజకీయ ఆరంగేట్రంపై జోరుగా వాదనలు వినిపిస్తున్న సమయంలోనే ఆంధ్ర ప్రదేశ్‌లో ఆయన మరో అఖిలేష్ యాదవ్ కాగలరా అనే చర్చ ప్రధానంగా జరుగుతోంది. రాజకీయంగా ఇరువురుకి చాలా పొంతనలు ఉన్నాయని ఆశావహులు గుర్తు చేస్తున్నారు. మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, ఉత్తర ప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ ఆధ్వర్యంలోని సమాజ్‌వాది పార్టీల గుర్తు ఒకటే. అది సైకిల్ గుర్తు.

ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో సైకిల్ హవా కొనసాగడంపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ... మన రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో సైకిల్ దూసుకు పోతుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇద్దరూ మంచి ప్రజ్ఞ కలిగిన వారు. అఖిలేష్‌కు రాజకీయ అనుభవం ఉండగా లోకేష్‌కు మాత్రం అది లేదు. అయితే టిడిపి క్యాడర్ ఒత్తిడి మేరకు ఆయన ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వస్తే 2014లో టిడిపి అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేకపోయినప్పటికీ.. 2019 వరకు మాత్రం ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ నేతలు చాలామంది ప్రతిపాదించే అవకాశాలు మెండు అంటున్నారు.

ఇప్పటికే పార్టీ నేతలు పార్టీకి ఓ యువనేత అవసరం ఉందని బాబుపై ఒత్తిడి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరంగేట్రం 2014లోపే ఎప్పుడైనా జరగవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన యుపి ఎన్నికలలో అఖిలేష్ అంతా తానై పార్టీని విజయపథం వైపు నడిపించారు. ఇందుకోసం అతను కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. గెలిచిన తర్వాత కూడా అవినీతి, రౌడీ ముద్ర ఉన్న వారిని తప్పించారు. మానిఫెస్టో రూపకల్పనలో కూడా అఖిలేష్‌దే ప్రధాన పాత్ర. విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని చెప్పి యువతను తన వైపుకు తిప్పుకున్నారు.

ఇక నారా లోకేష్ కుమార్ కూడా ఎన్నికల వ్యూహాల రచనలో సిద్ధహస్తుడనే చెప్పవచ్చు. 2009 సాధారణ ఎన్నికల సమయంలో నేరుగా రాజకీయ ప్రచారంలో పాల్గొననప్పటికీ మానిఫెస్టో రూపకల్పనలో లోకేష్‌దే ప్రధాన పాత్ర. 2009లో టిడిపి ఆకట్టుకునే ప్రజాకర్షక పథకాలతో ఎన్నికలకు వెళ్లింది. అయితే దురదృష్టవశాత్తూ చిరంజీవి పార్టీ స్థాపించడం టిడిపిని దెబ్బతీసింది. చిరంజీవి పిఆర్పీని స్థాపించకుంటే చంద్రబాబే ముఖ్యమంత్రి అయ్యే వాదనలతో దాదాపు అందరూ ఏకీభవిస్తారు.

2004లో కేవలం నలభైకి పైగా సీట్లతో సరిపెట్టుకున్న టిడిపి 2009లో అధికార కాంగ్రెసును, ఇమేజ్ కలిగిన చిరు పార్టీని ఢీకొని తొంబై వరకు సీట్లను సాధించడం వెనుక ప్రజాకర్షక పథకాలే అని చెప్పవచ్చు(టిఆర్ఎస్‌తో పొత్తు కూడా సీమాంధ్రలో టిడిపి కొంపముంచిందనే వాదన కూడా ఉంది). అలాంటి ప్రజాకర్షక పథకాలలో నిరుద్యోగ భృతి చాలా ముఖ్యమైనది. ఇప్పటికే కొన్ని దేశాలలో ప్రవేశ పెట్టిన ఈ పథకం ఇక్కడా అమలు చేయాలనే ఆలోచనతో లోకేష్ టిడిపి మేనిఫెస్టోలో దానిని జొప్పించారు.

అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ యుపి ముఖ్యమంత్రిగా పని చేశారు. చంద్రబాబు నాయుడు కూడా ఎపిని తొమ్మిదిన్నరేళ్లు పాలించారు. ఆ తర్వాత చాలాకాలం అక్కడ సైకిల్ అధికారానికి దూరంగా ఉండిపోయింది. టిడిపి కూడా వరుసగా రెండుసార్లు అధికారానికి దూరమైంది. నారా లోకేష్ ఎంట్రీతో యువత టిడిపి వైపు మొగ్గుతుందని భావిస్తున్నారు. 

ఆయన ఎంట్రీకి ఇదే మంచి సమయమని అంటున్నారు. యుపిలో మాయావతి విగ్రహాలు వివాదాస్పదమైనట్లే ఇక్కడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపిస్తున్న ఆయన తండ్రి దివంగత వైయస్ విగ్రహాలపై విపక్షాలు మండిపడుతున్నాయి. మరి లోకేష్ 2019 వరకు మరో అఖిలేష్ అవుతాడో లేదో కాలమే తేల్చాలి.

కామెంట్‌లు లేవు: