6 ఫిబ్ర, 2012

అసెంబ్లీ డిప్యూటీ లీడర్‌గా చిరంజీవి, ముందు సీటుకు?

ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడిగా కొనసాగుతున్న చిరంజీవికి శాసనసభలో తగిన స్థానం కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయనను శాసనసభ డిప్యూటీ లీడర్‌గా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దానివల్ల చిరంజీవికి తగిన హోదా కల్పించినట్లు అవుతుంది. దానితో పాటు శాసనసభలో ముందు వరుసలో కూర్చోవడానికి చిరంజీవికి వీలవుతుంది. చిరంజీవి వెనక బెంచీకి వెళ్తారనే ఉద్దేశంతోనే శానససభకు సంబంధించినంత వరకు కాంగ్రెసు ప్రజారాజ్యం విలీనం ప్రక్రియను ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినట్లు చిరంజీవి నుంచి శాసనసభ స్పీకర్‌కు ఇప్పటికే వెళ్లింది. అయితే, ఆ విలీనం ప్రక్రియను స్పీకర్ నాదెండ్ల మనోహర్ సాంకేతికంగా పూర్తి చేయలేదు. 

విలీన ప్రక్రియను స్పీకర్ పూర్తి చేస్తే శాసనసభలో చిరంజీవి వెనక బెంచీలో కూర్చోవాల్సి వస్తుంది. శాసనసభకు తొలి సారి ఎన్నికైన సభ్యులకు సంప్రదాయం ప్రకారం వెనక బెంచీలు కేటాయిస్తారు. చిరంజీవికి కూడా అదే పరిస్థితి కల్పించాల్సి వస్తుంది. దీంతో విలీన ప్రక్రియను అపి ఉంచారు. ఇప్పుడు ఆ విలీన ప్రక్రియను పూర్తి చేసి, చిరంజీవి మొదటి వరుస బెంచీలో కూర్చోవడానికి చేసే ఏర్పాట్లలో భాగంగానే చిరంజీవిని శానససభలో డిప్యూటీ లీడర్‌గా నియమించాలని ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు చిరంజీవి కూడా ప్రతి విషయంలో పాలు పంచుకోవడానికి వీలవుతుంది. ఆ రకంగా చిరంజీవికి విధాన నిర్ణయాల్లో, ఇతర విషయాల్లో ప్రాధాన్యం కల్పించినట్లవుతుంది. అయితే, దీనివల్ల చిరంజీవిని కేంద్ర మంత్రిగా తీసుకోవాలనే ఆలోచనకు స్వస్తి చెప్పిందా అనే అనుమానాలు కలిగే అవకాశాలున్నాయి.

కామెంట్‌లు లేవు: