1 మార్చి, 2012

హెలికాప్టర్‌లో బెంగళూర్ వెళ్తా: గాలి జనార్దన్ రెడ్డి

                                             Gali Janardhan Reddy
హైదరాబాద్: తనను హెలికాప్టర్‌లోనే కర్ణాటక రాజధాని బెంగళూర్ తరలించాలని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) అక్రమ తవ్వకాల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రోడ్డు మార్గాన వెళ్తే తనకు ప్రాణహాని ఉందని, అందువల్ల తనను హెలికాప్టర్‌లో తరలించాలని ఆయన అన్నారు. హెలికాప్టర్ ఖర్చులు తానే భరిస్తానని ఆయన చెప్పుకున్నారు. 

కర్ణాటక అక్రమ మైనింగ్ కేసులో బెంగళూర్‌లో గాలి జనార్దన్ రెడ్డి విచారణకు కోర్టు అనుమతించింది. దీంతో ఆయనను గురువారం బెంగళూర్‌కు తరలించాల్సి ఉంది. పిటి వారంట్ కింద ఆయనను తరలించాల్సి ఉంది. అసోసియెటెడ్ మైనింగ్ కంపెనీ (ఎఎంసి) కుంభకోణం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. దాదాపు 600 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో తీసుకుని వెళ్తే తనకు ప్రాణహాని ఉందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. 

హైదరాబాదులోని చంచల్‌గుడా జైలు నుంచి బెంగళూర్‌కు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంటుంది. రేపు (శుక్రవారం) ఉదయం పదిన్నర గంటలకు బెంగళూర్‌లోని సిబిఐ కోర్టు ముందు హాజరు పరచాల్సి ఉంది.

కామెంట్‌లు లేవు: