25 జూన్, 2012

చోటా నేతలు: పేరెత్తకుండా లగడపాటిపై మండిపడ్డ బాబు



















విజయవాడ: తాము ఎట్టి పరిస్థితులలో ఫ్లై ఓవర్ సాధించి తీరుతామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. దుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ కుమ్మరిపాలెం సెంటరు వద్ద చేపట్టిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. ఫ్లై ఓవర్ నిర్మించాలని డిమాండ్ చేశారు.
నిర్మాణం విషయంలో కాంగ్రెసు నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు.

కాంగ్రెసు నేతలు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారని, తనకు తెలియని టెక్నాలజీ వారికి తెలుసునట అని ఎద్దేవా చేశారు. నా పోరాటం ఎవరో ఒకరి పైన కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైన అన్నారు. చోటా మోటా నాయకులకు తాము జవాబు చెప్పే ప్రసక్తి లేదన్నారు. కొంతమందికి డబ్బు గర్వం పట్టుకుందన్నారు. కొందరికి ఒళ్లు బలిసి, ఫ్లై ఓవర్ నిర్మాణానికి డబ్బులు ఇస్తానని చెబుతున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ను ఉద్దేశించి అన్నారు.

టిడిపి గానీ, ప్రజలు గానీ ఆయన ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూడటం లేదన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణం కేంద్రం బాధ్యత అన్నారు. అభివృద్ధి టిడిపి హయాంలో తప్ప కాంగ్రెసు హయాంలో జరగలేదన్నారు. కాంగ్రెసు హయాంలో అవినీతి, దోపిడి జరిగిందన్నారు. కాంగ్రెసు హయాంలో ఎక్కడ చూసినా కరెంటు కోతలన్నారు. టిడిపి హయాంలో అధికారులు ఉన్నత స్థానానికి వెళితే కాంగ్రెసు హయాంలో జైళ్లకెళ్తున్నారన్నారు.
టిడిపిని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. తాము రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, వైయస్ రాజశేఖర రెడ్డిలను ఇలా ఎందరినో చూశామన్నారు. మీ పేరు కూడా ఎత్తనని లగడపాటిని ఉద్దేశించి అన్నారు. వందల ఫ్లైఓవర్లు కట్టిన ఘనత టిడిపిది అన్నారు. టిడిపి దెబ్బకు జాతీయ కాంగ్రెసు ప్రాంతీయ కాంగ్రెసుగా మారిందన్నారు. చోటామోటా నాయకులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఫ్లై ఓవర్ వచ్చే వరకు టిడిపి పోరాడుతుంది.

విజయవాడలో జనాభా పెరిగిందని, అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ఫ్లై ఓవర్ వల్ల ప్రకాశం బ్యారెజికి ఎలాంటి నష్టం లేదన్నారు. నిర్మాణం చేతకాకపోతే రాజీనామా చేయాలని సూచించారు. కాంగ్రెసు ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. టిడిపితో పెట్టుకుంటే నాశనమైపోతారన్నారు. ఏం కొందామన్న బ్లాక్ మార్కెటే అన్నారు.

కామెంట్‌లు లేవు: