27 జూన్, 2012

జగన్‌కు సిఎంననే ఫీలింగ్: కోర్టులో సిబిఐ, జడ్జి చివాట్లు



















హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు తాను ముఖ్యమంత్రిగా ఊహించుకుంటున్నారని సిబిఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) తరఫు న్యాయవాది హైకోర్టులో బుధవారం వాదించారు. తన అరెస్టు అక్రమమని జగన్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పైన జగన్ తరఫు న్యాయవాది రామ్ జెఠ్మలానీ ముందుగా తన వాదనలు వినిపించారు.

అనంతరం సిబిఐ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. జగన్ అరెస్టు అక్రమం కాదని సక్రమమే అని కోర్టుకు తెలిపారు. జగన్ బెయిల్ పొందేందుకు అనర్హుడు అని చెప్పారు. భారతి సిమెంట్స్, వాన్‌పిక్ మరో రెండు కంపెనీలపై దర్యాఫ్తు చేశామని చెప్పారు. వాన్‌పిక్ దర్యాఫ్తు కొనసాగుతోందని తెలిపారు. జగన్ రూ.43వేల కోట్ల ఆర్థిక నేరానికి పాల్పడ్డారని కోర్టుకు విన్నవించారు.

జగన్ కేసులో ఇప్పటికే మూడు ఛార్జీషీట్లు దాఖలు చేశామని, మరో నాలుగు ఛార్జీషీట్లు దాఖలు చేస్తామని చెప్పారు. జగన్ నిందితులపై బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఇప్పటికే 164 స్టేట్‌మెంట్లు సేకరించామని తెలిపారు. జగన్ కంపెనీలలోకి ఫ్రెంచ్ నుండి పెట్టుబడులు వచ్చినట్లుగా తెలుస్తోందన్నారు. ఆ దిశలో దర్యాఫ్తు కొనసాగుతోందని తెలిపారు. ఫ్రెంచ్ నుండి దీనిపై సమాధానం రావాల్సి ఉందని చెప్పారు.

కాగా జగన్ తనకు తాను ముఖ్యమంత్రిగా ఊహించుకుంటున్నారని న్యాయవాది చెప్పారు. అమాయక ప్రజలు ఓట్లేస్తే ఇటీవల ఉప ఎన్నికలలో ఆయన స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 సీట్లు గెలుచుకుందని చెప్పారు. అమాయక ప్రజలు ఓటేసినంత మాత్రాన క్లీన్ చిట్ ఇచ్చినట్లు కాదన్నారు. ప్రజలను అమాయకులనడంపై న్యాయవాది గోవిందరాజులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని న్యాయవాదికి చివాట్లు పెట్టారు.

ఇలాంటి వ్యాఖ్యలు ఇకముందు ఉపయోగించవద్దని చెప్పారు. కాగా జగన్, సిబిఐ తరఫు న్యాయవాదులు బలంగా తమ వాదనలు వినిపించారు. సిబిఐ తరఫు న్యాయవాది గురువారం వాదనలు పూర్తి చేయనున్నారు. అనంతరం కోర్టు తీర్పు వెలువర్చనుంది.










కామెంట్‌లు లేవు: