27 జూన్ 2012

టార్గెట్ సిబిఐ జెడి: జగన్ వరుస వ్యూహాలు




















తన అక్రమాస్తుల కేసు విచారణ జరుపుతున్న సిబిఐ జెడి లక్ష్మీ నారాయణను మానసికంగా దెబ్బతీసే విధంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వరుస వ్యూహరచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆయన జెడిపై ఢిల్లీ స్థాయిలో యుద్ధం చేసేందుకు సన్నద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అపాయింటుమెంట్ కోరింది.

రెండు మూడు రోజుల్లో అపాయింటుమెంటు వచ్చే అవకాశముందని అంటున్నారు. పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సహా పలువురు నేతలు ఢిల్లీ వెళ్లి మన్మోహన్‌ను కలవనున్నారు. జగన్ వ్యతిరేకులతో కలిసి సిబిఐ జెడి తమ పార్టీ అధినేతపై కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. వ్యతిరేక మీడియా, పార్టీలతో కలిసి కుట్ర పన్నుతున్న జెడిని వెంటనే అక్కడ నుండి బదలీ చేయాలని, లేదంటే తమకు న్యాయం జరగదని వారు ప్రధానికి మొర పెట్టుకోనున్నారట.

జెడి ఉన్నంత కాలం తమ పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు, ఆయనను మానసికంగా బలహీనుడిని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నదని అంటున్నారు. అందుకు ఇటీవల జరుగుతున్న సంఘటనలను వారు ఉదహరిస్తున్నారు. సిబిఐ జెడి కాల్ లిస్టును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బయట పెట్టడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. జెడి కొందరు విలేకరులతో మాట్లాడుతున్నారని, అది తమకు అనుమానాలు కలిగిస్తుందని జగన్ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

జగన్‌ను భౌతికంగా దెబ్బతీసేందుకే ఇలాంటి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వాసిరెడ్డి చంద్రబాల అనే ఐబిఎం ఉద్యోగిని, లీడ్ ఇండియా కార్యకర్త జెడితో, ఆంధ్రజ్యోతి ఎండితో మాట్లాడటాన్ని వారి పాయింట్ అవుట్ చేస్తూ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ అంశంలో జెడిని టార్గెట్ చేసుకోవాలనుకున్న జగన్ పార్టీ నేతలు చివరకు వారే వెనక్కి తగ్గినట్లుగా కనిపించింది. అయితే ఆ ఆస్త్రం ఫలించక పోవడంతో ఇప్పుడు ఏకంగా ఢిల్లీ వెళ్లి కుట్ర - బదలీ అంశంతో జెడిని బలహీనపర్చాలని చూస్తున్నారని అంటున్నారు.