25 జులై, 2012

బాలకృష్ణ కేసు : రాఘవేంద్రరావుకి కోర్టు నోటీసులు





















హైదరాబాద్ : చిన్న చిత్రాల దర్శకుడు బాలకృష్ణ వేసిన కేసుకు సంబంధించి రాష్ట హైకోర్టు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు నోటీసులు జారీ చేసింది. సినీ మాక్స్ స్థలం వివాదంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ కేసు విచారణను మరో రెండు వారాలు వాయిదా వేసింది.

ప్రభుత్వం కేటాయించిన స్థలంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడంపై ఈ నోటీసులు జారీ అయ్యాయి. అదే విధంగా ప్రభుత్వానికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. రాఘవేంద్రరావు నిబంధనలకు విరుద్ధంగా జూబ్లీ హిల్స్‌లో సినీమాక్స్ కాంప్లెక్స్ కట్టారని, ప్రభుత్వాన్ని మోసం చేసి వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తూ సినీ దర్శకుడు బాలకృష్ణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

వాస్తవానికి రాఘవేంద్రరావు సినీ పరిశ్రమకు ఉపయోగ పడే స్టూడియో కడతానని చెప్పి కోట్ల విలువైన భూమిని కారు చవకగా దక్కించుకున్నాడని, నిబంధనల ప్రకారం ఆ స్థలంలో సినీ స్టూడియో లాంటివి మాత్రమే నిర్మించాలి.. కానీ రాఘవేంద్రరావు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాఘవేంద్రరావు నిబంధనలు అతిక్రమించాడని రుజువైతే ప్రభుత్వం ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.

కోర్టు నోటీసుల నేపథ్యంలో రాఘవేంద్రరావు న్యాయ నిపుణుల సహకారంతో వివరణ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. మరి ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో..? సినీ మాక్స్ స్థలం తన చేతి నుంచి జారి పోకుండా ఎలా కాపాడుకుంటాడో చూడాలి.

కామెంట్‌లు లేవు: