25 జులై, 2012

రెండు వైయస్ విగ్రహాలకు నల్ల రంగు: పాలతో అభిషేకం
















హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు నగరంలోని రెండు చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు నల్ల రంగు పులిమారు. సోమవారం తెల్లవారుజామున దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ రోడ్డులో ఉన్న విగ్రహానికి నల్ల రంగు వేశారు. అలాగే పంజాగుట్ట చౌరస్తాలోని విగ్రహం పైకి తారును విసిరారు.

దుండగులు విగ్రహం పైకి తారును విసురుతున్న సమయంలో పోలీసులు సమీపంలో ఉన్నారు. అది గమనించిన పోలీసులు వారిని వెంబడించడంతో పారిపోయారు. అయితే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు తారు పడిన ప్రదేశాన్ని వెంటనే శుభ్రం చేయించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. విషయం తెలిసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు విగ్రహాలకు పాలాభిషేకం చేశారు.

కాగా వైయస్ విజయమ్మ సోమవారం సిరిసిల్లలో చేనేత దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆమె దీక్షను అడ్డుకుంటామని తెలంగాణవాదులు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు హెచ్చరించారు. అన్నట్లుగానే విజయమ్మ ఉదయం హైదరాబాదు నుండి బయలుదేరినప్పటి నుండి సిరిసిల్ల వరకు పలుచోట్ల ఆమె కాన్వాయ్‌ని అడ్డుకున్నారు.

నగరం దాటే వరకు మూడు నాలుగు సార్లు ఆపిన తెలంగాణవాదులు, సిద్దిపేట దాటిన తర్వాత సిరిసిల్లకు వెళ్లే దారిలో విజయమ్మ కాన్వాయ్‌ను ఆపే క్రమంలో భాగంగా రణరంగాన్ని తలపించింది. ఆమె కాన్వాయ్ పైకి రాళ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లు విసిరారు. విజయమ్మ దీక్ష నేపథ్యంలో జిల్లాలో ఓ చోట వైయస్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేసారు.


కామెంట్‌లు లేవు: