6 జులై, 2012

టెర్రర్ లింక్స్: బాలీవుడ్ నటి లైలాఖాన్ దారుణ హత్య?




















శ్రీనగర్: అదృశ్యమైన బాలీవుడ్ నటి లైలా ఖాన్ మృతి చెందింది. ఈ విషయాన్ని జమ్ము కాశ్మీర్ పోలీసులు తెలిపారు. లైలా ఖాన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు అందరు ముంబయిలో మృతి చెందారని చెప్పారు. పోలీసు కస్టడీలో ఉన్న పర్వేజ్ అహ్మద్ తక్.. లైలా, ఆమె కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు విచారణలో తెలిపాడు. వారంతా ముంబయిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారని చెప్పారు. వారిని దారుణంగా హత్య చేసినట్లుగా తక్ చెప్పినట్లుగా తెలుస్తోంది.

పాకిస్తాన్‌లో పుట్టిన లైలా ఖాన్ ఆ తర్వాత బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఇటీవలే లష్కరే తోయిబాతో లింక్స్ ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఉగ్రవాదులతో సంబంధం ఉండటం వల్లే ఆమె అదృశ్యమైందనే వాదనలు వినిపించాయి. కానీ అహ్మత్ తక్ ఆమె మృతి చెందిందని స్పష్టం చేశారు. లైలా మృతదేహాన్ని పోలీసులు ముంబయిలో కనుగొన్నారు.

ఆమె 2011వ సంవత్సరం మే 29 నుండి కనిపించకుండా పోయింది. ఇటీవలే అహ్మద్ తక్.. లైలా ఖాన్ మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంను పెళ్లి చేసుకున్నట్లుగా పోలీసులకు తెలిపిన విషయం తెలిసిందే. టెర్రరిస్టులతో లింక్స్ ఉన్నాయని తేలడంతో మహారాష్ట్ర ఏటిఎస్(యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్) ఆమె కోసం గాలింపులు కూడా చేపట్టారు. తన కూతురు లైలా ఖాన్ తన తల్లి, చెల్లితో పాటు కనిపించకుండా పోయిందని ఆమె తండ్రి ఇటీవల ముంబయి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కాగా అంతకుముందు ఢిల్లీ హైకోర్టు పేలుడులో వర్దమాన తార లైలా ఖాన్ పాత్రపై అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. 2011 ఫిబ్రవరీలో పేలుళ్లు సంభవించిన మరుక్షణం నుంచి ఆమె ఆశ్చర్యకరంగా ఎవరికీ కనిపించకుండా పోయింది. లైలా ఖాన్ అసలు పేరు రేష్మా పటేల్. ఈ పేలుళ్లలో ఆమె పాత్రపై మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్), ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు బలగాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

హైకోర్టు పేలుడుకు ముందు లైలా ఖాన్, ఆమె అసోసియేట్ ఢిల్లీలో ఉన్నారా అనే విషయాన్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ప్రత్యేక బలగం పోలీసులు ఇతర నిఘా సంస్థలతో టచ్‌లో ఉన్నారు. లైలా ఖాన్ లష్కరే తోయిబా మిలిటెంట్ పర్వేజ్ ఇక్బాల్ తక్‌తో స్నేహం చేసినట్లు అనుమానిస్తున్నారు. తక్ అద్దెకు తీసుకున్న దుకాణంలో లైలా ఖాన్ తల్లి సలీనా పటేల్‌కు చెందిన మత్సుబిషి అవుట్ ల్యాండర్ పోలీసులకు చిక్కింది. నిరుడు సెప్టెంబర్‌లో హైకోర్టు వద్ద పేలుళ్లకు వాడిన పదార్థాలను ఈ వాహనంలోనే చేర వేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

లైలా ఖాన్ పాకిస్తాన్ సినిమాల్లో నటించింది. 2008లో రాజేష్ ఖన్నా చిత్రం వఫాలో ఆమె నటించింది. ఆమె కాల్ రికార్డులను పరిశీలిస్తే చివరి కాల్ నాసిక్‌లో ఉన్నప్పుడు నమోదైంది. అది 2011 ఫిబ్రవరిలో. తక్ 2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపి తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. తక్ పరారీలో ఉండగా, అతని సన్నిహిత మిత్రుడిని షకీర్ హుస్సేన్‌ను ప్రశ్నించడానికి అదుపులోకీ తీసుకున్నారు. లైలా ఖాన్‌ను, పేలుళ్లలో మరో అనుమానితుడిని మిలిటెంట్లు కిస్త్వర్‌లో చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

లైలా ఖాన్ కుటుంబ సభ్యులు కిష్త్వర్ రాలేదని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. లైలా ఖాన్ కుటుంబ సభ్యుల అదృశ్యం వెనక తక్ పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అతను పట్టుబడితే తప్పు ఆ కుటుంబం గురించి తెలియదని వారు చెబుతున్నారు. లైలా ఖాన్, ఆమె తల్లి, సోదరి, సవతి తండ్రి, సోదరుడు నిరుడు ముంబై నుంచి ఎస్వీయులో కిష్త్వర్ వెళ్లారని ముంబై ఎటిఎస్ వర్గాలంటున్నాయి.

లైలా ఖాన్ దుబాయ్‌లో ఉండవచ్చుననే వార్తలను కూడా ఖండిస్తున్నాయి. సాక్ష్యం లభించే వరకు పేలుళ్లలో లైలా ఖాన్ పాత్ర ఉందని చెప్పలేమని ఎటిఎస్ వర్గాలంటున్నాయి. అయితే, మూడేళ్ల క్రితం లైలా ఖాన్ బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ హుజీ సభ్యుడు మునీర్ ఖాన్‌ను లైలా ఖాన్ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె మృతి చెందినట్లుగా పోలీసులు చెప్పారు.


కామెంట్‌లు లేవు: