6 ఫిబ్ర, 2012

నాపైనా విచారణ జరపండి: వైయస్ జగన్ వర్గ ఎమ్మెల్యే

 రాష్ట్రంలో సీబీఐ విచారణ ఏకపక్షంగా సాగుతోందని వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తనతో సహా నాటి వైఎస్ క్యాబినెట్‌లో ఉన్న మంత్రులందరిపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆయన మీడియా ప్రతినిధులతో ఆదివారం మాట్లాడారు. అవినీతి కేసులను సీబీఐ విచారిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. విధాన నిర్ణయాలు తీసుకున్న ఆనాటి మంత్రులను వదిలివేసి కేవలం పరిపాలన బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్‌లను వేధించడం సరికాదన్నారు. 

సీబీఐ తీరు ఐఏఎస్‌లపై కక్షగట్టినట్లు ఉందన్నారు. వైఎస్ హయాంలో తాను గనుల శాఖ మంత్రిగా పని చేశానని, ఈ దృష్ట్యా తనపైనా విచారణ జరిపి తప్పు చేసినట్లు వెల్లడైతే శిక్షించాలని అన్నారు. అప్పటి మంత్రులంతా విచారణకు సిద్ధపడ్డాలన్నారు. కేవలం ఐఏఎస్‌లనే దోషులుగా చిత్రీకరించడం సరికాదన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు సంబంధించి చంద్రబాబు హయాంలోనే అనుమతులురాగా సీబీఐ ఆయనను విచారించకుండా, కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపైనే కక్షగట్టి విచారణ జరుపుతోందని విమర్శించారు. ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని ధ్వజమెత్తారు. 

వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని, ప్రాజెక్టు పనులకు తగినంత నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. వైఎస్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శించారు. ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పటిష్ఠంగా ఉందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

కామెంట్‌లు లేవు: