1 మార్చి, 2012

భూమున్నా ఇక నీరుండదు

పాలమూరు గొంతెండిపోతోంది. పక్కనే కృష్ణానది పరవళ్ళు తొక్కుతున్నా గుక్కెడు నీరు కరువైపోయింది. ప్రతీ ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలు మంచినీటి సమస్యనే ప్రధానాంశంగా ఎత్తిచూపుతున్నా ఎన్నికల తర్వాత హామీలన్నీ ఎండమావినే తలపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని నడిస్తున్న స్థానిక ఎంపీ కేసీఆర్‌ సైతం నీటి సమస్యసై ముసలికన్నీరే కారుస్తున్నారు. 

పాలమూరు నీటి సమస్యపై మా ప్రత్యేక ప్రతినిధి కప్పర ప్రసాదరావు అందిస్తున్న స్పెషల్‌ ఫోకస్‌. మహబూబ్‌నగర్‌... ఈ పేరు చెబితే గుర్తొచ్చేది వలసలే. పిడికెడన్నం కోసం వలసపోయే కష్టజీవులే. ఇక్కడ సాగుభూములు కోకొల్లలైనా దోసెడు నీరుండదు. వెరసి బీడుపడ్డ భూమాత రైతన్నను వెక్కిరిస్తోంది. వలసపోయైనా బ్రతుకుపోరు చేయమంటూ మౌనంగానే రోధిస్తోంది. జిల్లా కేంద్రమైన పాలమూరులోనూ ఇదే పరిస్థితి. 

జానెడు నేల తడవదు. జనం గొంతు సేద తీరదు. ఎటు చూసినా నీటి సమస్య. సాగునీరు... తాగునీరు రెండూ ఇక్కడ జనాలకు కలే. ఈ సమస్య ఈ నాటిది కాదు. దశాబ్ధాల నుంచి పాలమూరు గొంతెడిపోతున్నా పాలకులు బీడుపడి నెర్రలొచ్చిన భూమినే ఎన్నికల పెట్టుబడిగా తీసుకుంటున్నారు. అటు తర్వాత బువ్వపెట్టిన ఆ భూమినే చిన్నచూపు చూస్తున్నారు. ఎన్నికలొచ్చేసరికి నీరే ప్రధాన ఎజెండా అంటూ ప్రగల్భాలు పలుకుతారు నేతలు. నీళ్ళివ్వందే ఓట్లేయమంటారు జనం. 

కానీ ఆ తంతుకాస్తా పూర్తయ్యే సరికి నీరడిగిన గొంతువైపే చూడరు ఇక్కడి నాయకగణం. ఇక్కడ ప్రధాన నీటి వనరు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌. దీని ద్వారా రామన్‌పాడు ప్రాజెక్టు నిండితే మహబూబ్‌నగర్‌ దాహార్తి తీరేది. దోసెడు ఒడ్లు పండేది. నాలుగు లిఫ్ట్‌ల ద్వారా మహబూబ్‌నగర్‌ ఫిల్టర్‌బెడ్‌కు నీరు చేరాలి. అయితే దారి పొడవునా పైపుల లీకేజీలు, పగుళ్లు ఆ నీటిని దారిలోనే మింగేస్తున్నాయ్‌. దీంతో అరకొరక మంచినీరే ఇక్కడి ప్రజలకు అందుతోంది. 

దీనికి తోడు నీటి సరఫరా సమయంలో కరెంట్‌ కట్‌ చేయడంతో గుక్కెడు నీళ్ళ కోసం ఇక్కడ నిత్య పోరాటం చేయాల్సిందే. పన్నులు మాత్రం టెంచనుగా కట్టించుకొనే పాలమూరు మునిసిపాలిటీ మంచినీళ్ళవైపు చూసేది పదిరోజులకొకసారే. ఇక వాడకానికిచ్చే ఉప్ప నీరు వారానికోసారి. ఇక్కడ ఏ నీరు కావాలన్నా భగీరధ ప్రయత్నం చేయాల్సిందే. కూలీ సైతం మాని పానీపట్టు యుద్దంలో శక్తియుక్తుల్ని వాడాల్సిందే. 

ఎన్నికల్లో ఇచ్చే హామీలోనే ఇక్కడ నీటి బిందెలు నిండిపోతాయి. అవే తాత్కాళికంగా ఇక్కడ దాహార్తిని తీరుస్తాయి. మళ్ళీ ఎన్నికొలొచ్చేదాకా తాగు,సాగునీటి పోరాటాలే. ఈ సారైనా ఉప ఎన్నికల్లో నాయకులను నిలదీస్తామంటున్నారు ఇక్కడి వాసులు. ఇక గుప్పెడు ఒడ్లు పండిచైనా గుక్కెడు గంజి తాగుదామనుకుంటున్న అన్నదాతల కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయ్‌. 

కోయిల్‌సాగర్‌ నుంచి విడుదలవ్వాల్సిన సాగునీరు సైతం పాలమూరుకు మంచినీటి అవసరాలకు ఉపయోగించేస్తున్నారు. దీంతో రైతన్నల గుండె తడారిపోతోంది. సాగునీరివ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. నీటి సంఘం నేతలను నిలదీస్తున్నారు. అయితే నీటి సంఘం నేతలు సైతం కోయిల్‌సాగర్‌ నీటిని మహబూబ్‌నగర్‌కు తరలించడం సరైంది కాదంటున్నారు. 

కలెక్టర్‌ అధికారాలు ఉపయోగించి నీటిని తీసుకుపోతున్నారని అంటున్నారు. జూరాల బ్యాక్‌ వాటర్‌ను కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులో నింపాల్సి ఉంది. నీరు పుష్కళంగా ఉంటేనే పాలమూరు అవసరాలకు వినియోగించాల్సి ఉంది. అయితే ఇక్కడ నీటి నిల్వ ఎంత ఉన్నా అది ప్రజల మంచినీటి అవసరాలకే పరిమితం చేస్తున్నారు. దీంతో అన్నదాతలు వానదేవుడ్నే నమ్ముకోవాల్సి వస్తోంది. 

ఇక కోయిల్‌ సాగర్‌ ఎత్తిపోతల పథకం పనులు కూడా నత్తనడకనే సాగుతున్నాయ్‌. ఇవి ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు. దీంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అటు మహబూబ్‌నగర్‌ వాసులు సైతం పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్నా వందలు వెచ్చించి నీటిని కొనుక్కోవాల్సి వస్తోంది. ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న కుటుంబాలు నీటిని కొనుగోలు చేస్తున్నా పేదలు నీళ్ళందక తడారిపోతున్నారు. 

కనీస అవసరమైన స్నానానికి సైతం దూరమైపోతున్నారు. సర్కార్‌ ఎన్ని నిధులు , ఎన్నికల హామీలు, మేడలు, మిద్దెలు, ఉద్యోగాలు ఇవేమీ ఇక్కడి ప్రజలకు పట్టడం లేదు. వీళ్ళడిగేది గుక్కెడు తాగు నీళ్ళు. కడివెడు సాగునీళ్ళు.


కామెంట్‌లు లేవు: