20 జూన్, 2012

నలుగురు హీరోలుకి మోహన్ బాబు విలన్




















మోహన్ బాబు చాలా కాలం తర్వాత విలన్ గా కనిపించనున్నాడు. ఆ మధ్యన యమదొంగలో యముడుగా కొద్దిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన మోహన్ బాబు ఆ తర్వాత ఏక్ నిరంజన్ లోనూ విలన్ గా చేసారు. అయితే ఇప్పుడు తన కుమారుడు మంచు విష్ణు వర్ధన్ నిర్మిచే చిత్రంలో ఆయన విలన్ గా చేయనున్నారు. ఈ చిత్రంలో మంచు విష్ణు తో పాటు నలుగురు హీరోలు చేస్తున్నారు.

ఈ విషయమై మంచు విష్ణు మాట్లాడుతూ... 'దేనికైనా రెడీ' తర్వాత 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మరో సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నా. ఇందులో నేను కాకుండా మరో ముగ్గురు నా జనరేషన్ కి చెందిన హీరోలుంటారు. అంటే మొత్తం నలుగురు హీరోలు. విలన్ కేరక్టర్‌ను నాన్నగారు చేస్తారు. రెండు వారాల్లోగా మిగతా ముగ్గురు హీరోలెవరో ప్రకటిస్తాం. వాళ్లు నా స్నేహితులే అన్నారు.

ఇక దర్శకుడు ఎవరనేది చెపుతూ..సురేందర్‌రెడ్డి సినిమాలకి సహ దర్శకుడిగా పనిచేసిన తూప్రాన్ శ్రీను చెప్పిన స్క్రిప్టు చాలా బాగా నచ్చింది. అతన్ని శ్రీను వైట్ల పంపించారు. ఇది కామెడీ యాక్షన్ ఫిల్మ్. రెగ్యులర్ సినిమాల తరహాలో హీరోయిన్‌తో డ్యూయెట్లు పాడుకోవడం వంటివి ఇందులో ఉండవు. ఇలాంటి స్క్రిప్టులు అరుదుగా వస్తాయి అని అన్నారు.

అలాగే ప్రస్తుతం మోహన్ బాబు తన తదపరి చిత్రం రావణకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో మనోజ్,విష్ణు నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై మంచు విష్ణు మాట్లాడుతూ..నేను, మనోజ్ కలిసి నటించడం ఇప్పుడల్లా జరగదు. అది కష్టం. ఏమన్నా అవకాశాలుంటే అది కె. రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసే పౌరాణిక చిత్రం 'రావణ'లో ఉన్నాయి. కచ్చితంగా చెప్పలేను. అందులో నాన్నగారు టైటిల్ రోల్ చేయబోతున్న సంగతి తెలిసిందే అన్నారు.

కామెంట్‌లు లేవు: